అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం సూరత్ జిల్లాలో దారుణం జరిగింది. తమను ఉద్యోగం నుంచి తొలగించాడన్న కోపంతో ఓ ఫ్యాక్టరీలో పనిచేసే ఇద్దరు కార్మికులు ఏకంగా ఆ ఫ్యాక్టరీ యజమానినే హత్యచేశారు. అతనితోపాటు అడ్డొచ్చిన మరో ఇద్దరిని కూడా చంపేశారు. మృతుడి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సూరత్ జిల్లాలోని ఆమ్రోలీ పోలీస్స్టేషన్ పరిధిలోగల వేదాంత ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులలో ఇద్దరు ఇటీవల ఆ ఫ్యాక్టరీ యజమానితో గొడవ పెట్టుకున్నారు. దాంతో యజమాని ఆ ఇద్దరు కార్మికులను ఫ్యాక్టరీ ఓనర్ విధుల నుంచి తొలగించాడు. దాంతో అతనిపై కక్ష పెంచుకున్న కార్మికులిద్దరూ పథకం ప్రకారం హత్యచేశారు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిని కూడా చంపేశారు.
ఫ్యాక్టరీ యజమానిని హత్య చేసిన కేసులో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని సూరత్ డీసీపీ చెప్పారు. నిందితుల్లో ఒకరు మైనర్ అని తెలిపారు.