అహ్మదాబాద్: గుజరాత్ లో రెండో, చివర దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సెకండ్ ఫేజ్లో మొత్తం 14 జిల్లాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 93 స్థానాల్లో 61 రాజకీయ పార్టీలకు చెందిన 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరో 285 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ గుజరాత్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అహ్మదాబాద్ నగరంలోని రాణిప్ ప్రాంతంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ప్రధాని మోదీ, అహ్మదాబాద్లోని నారన్పురా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అమిత్ షా ఓటు వేయనున్నారు.
డిసెంబర్ 1న తొలి దశలో భాగంగా 19 జిల్లాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 92 సీట్లు అవసరం. గత ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు రాగా.. కాంగ్రెస్కు 77 సీట్లు వచ్చాయి. గుజరాత్లో 27 ఏండ్లుగా బీజేపీ అధికారం దక్కించుకుంటూ వస్తున్నది. ఈసారి ఆప్ కూడా గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితతాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి.