అహ్మదాబాద్: గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో (Godhra riot Cases) నిందితులైన మరో 35 మందిని నిర్దోషులుగా గుజరాత్ కోర్డు ప్రకటించింది. గోద్రా అల్లర్లు ప్రణాళిక ప్రకారం జరుగలేదని పేర్కొంది. కాగా, నాలుగు కేసులకు సంబంధించి 52 మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసుల విచారణ కాలంలో 17 మంది చనిపోయారు. దీంతో మిగతా 35 మంది నిందితులను నిర్దోషులుగా పంచమహల్ జిల్లాలోని హలోల్ పట్టణంలోని కోర్టు ప్రకటించింది. 21 ఏళ్ల కిందట జరిగిన గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల విచారణను ముగించింది. ఈ అల్లర్లలో ముగ్గురిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు విఫలమైనట్లు కోర్టు పేర్కొంది. ఈ నెల 12న రిజర్వ్ చేసిన తీర్పును గురువారం వెల్లడించింది.
కాగా, గోద్రా అల్లర్లు ప్రణాళికాబద్ధంగా జరిగినట్లు రాజకీయ నేతలు, మీడియా చేసిన ఆరోపణలు తప్పంటూ కోర్టు మండిపడ్డింది. ఈ కేసుల విచారణలో ఇది నిర్ధారణ కాలేదని తెలిపింది. నిందితుల నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకోలేదని, వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ఆరోపించింది.