అహ్మదాబాద్: భార్యాభర్తలు (Gujarat Couple) అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ జంటను ఇరాన్లో కిడ్నాప్ చేసి నిర్బంధించారు. కిడ్నాపర్లు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. చివరకు పది లక్షలు అందుకుని ఆ దంపతులను విడిచిపెట్టారు. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన 29 ఏళ్ల పంకజ్ పటేల్, 29 ఏళ్ల భార్య నిషా పటేల్ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలని భావించారు. ఏజెంట్లు అభయ్ రావల్, పింటు గోస్వామిని వారు సంప్రదించారు. తొలుత ఇరాన్కు అక్కడి నుంచి మెక్సికోకు తీసుకెళ్లి అమెరికాకు పంపుతామని వారు హామీ ఇచ్చారు. దీని కోసం రూ.1.5 కోట్లు అడిగారు. అయితే ఆ దంపతులు ముందుగా ఎలాంటి డబ్బులు చెల్లించలేదు.
కాగా, గాంధీనగర్ కార్యాలయంలో ఉన్న ఏజెంట్ రావల్ తొలుత పంకజ్ పటేల్, ఆయన భార్య నిషా పటేల్ను జూన్ 3న విమానంలో హైదరాబాద్కు పంపాడు. లోకల్ ఏజెంట్ షకీల్ ద్వారా వారికి ఇరాన్ వీసాలు సమకూర్చాడు. జూన్ 13 ఆ దంపతులు ఇరాన్ రాజధాని టెహ్రాన్ చేరుకున్నారు. వాసిమ్తోపాటు మరి కొందరు వ్యక్తులు ఆ జంటను అక్కడ కిడ్నాప్ చేశారు. ఒక హోటల్కు తీసుకెళ్లి నిర్బంధించారు. ఆ దంపతుల విడుదలకు రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. వారి కుటుంబంపై ఒత్తిడి తెచ్చేందుకు కిడ్నాపర్లు పంకజ్ పటేల్ను చిత్ర హింసలకు గురిచేశారు. అతడి వీపును బ్లేడ్తో కోసిన వీడియో క్లిప్, అలాగే బెల్ట్తో కొట్టిన వీడియో క్లిప్ను పంకజ్ సోదరుడి వాట్సాప్కు పంపారు. అయితే గర్భిణీ అయిన పంకజ్ భార్య నిషా జోలికి వారు వెళ్లలేదు.
మరోవైపు పంకజ్ సోదరుడు సంకేత్ పటేల్, ఏజెంట్ రావల్ను సంప్రదించాడు. కిడ్నాపర్లకు డబ్బులు ఇస్తే ఆ జంటను వారు విడుదల చేస్తారని అతడు చెప్పాడు. ఈ నేపథ్యంలో సంకేత్ రూ.10 లక్షలను రావల్కు ఇచ్చాడు. దీంతో అతడు హవాలా మార్గంలో రెండు విడతలుగా కిడ్నాపర్లకు చెల్లించాడు. పంకజ్, అతడి భార్య నిషాను కిడ్నాపర్లు విడుదల చేసినట్లు ఈ నెల 18న సంకేత్కు చెప్పాడు. అనంతరం రావల్, గోస్వామి తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేశారు.
కాగా, పంకజ్, నిషా దంపతులు బుధవారం తిరిగి గుజరాత్ చేరుకున్నారు. గాంధీనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వారిని అడ్మిట్ చేశారు. పంకజ్ ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలేదని డాక్టర్లు తెలిపారు. కిడ్నాపర్ల చెరలో అతడు అనుభవించిన మానసిక, శారీరక చిత్ర హింసలను తట్టుకోలేక షాక్లో ఉన్నాడని, తనను చంపవద్దని అతడు కలవరిస్తున్నాడని చెప్పారు. అయితే గర్భవతి అయిన భార్య నిషా బాగానే ఉన్నదని, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.
మరోవైపు, పంకజ్ సోదరుడు సంకేత్ పటేల్ ఈ కిడ్నాప్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏజెంట్లు అభయ్ రావల్, పింటు గోస్వామిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.