అహ్మదాబాద్: అనుమానిత లావాదేవీల ఆరోపణలతో పలు వ్యక్తులకు చెందిన సుమారు 335 బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. ఆ బ్యాంకు ఖాతాలను అన్ఫ్రీజ్ చేసేందుకు లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశారు. (Gujarat Police extort money) ఒక వ్యక్తి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ స్కామ్కు సంబంధించి ముగ్గురు పోలీస్ అధికారులపై కేసు నమోదు చేశారు. గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కేరళకు చెందిన కార్తీక్ భండారీ గుజరాత్లోని జునాగఢ్లో నివసిస్తున్నాడు. తన బ్యాంకు ఖాతాను బ్యాంకు అధికారులు స్తంభించినట్లు గత ఏడాది డిసెంబర్లో తెలుసుకున్నాడు. బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా జునాగఢ్ సైబర్ క్రైమ్ సెల్ పోలీసుల ఆదేశాల మేరకు ఇలా చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.
కాగా, కార్తీక్ తన బ్యాంకు ఖాతా ఫ్రీజ్ గురించి జునాగఢ్ సైబర్ సెల్ పోలీసులను సంప్రదించాడు. కొన్ని డాక్యుమెంట్లు, బ్యాంకు స్టేట్మెంట్లను వారు అడిగారు. వాటిని సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో జనవరి 16న జునాగఢ్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) కార్యాలయానికి వెళ్లాడు. సైబర్ క్రైమ్ సెల్ ఇన్స్పెక్టర్ ఏఎం గోహిల్, ఏఎస్ఐ దీపక్ జానీని కలిశాడు. కోట్లలో అనుమానిత లావాదేవీల జరుగడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి తమకు రహస్య సమాచారం అందినట్లు ఏఎస్ఐ జానీ తెలిపాడు. బ్యాంకు ఖాతా అన్ఫ్రీజ్ చేసేందుకు రూ. 25 లక్షలు లంచం డిమాండ్ చేశాడు.
మరోవైపు తాను అంత డబ్బు ఇచ్చుకోలేనని, మూడు నుంచి నాలుగు లక్షలు ఇస్తానని కార్తీక్ తెలిపాడు. అయితే బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసిన ఇతర ఖాతాదారులు కనీసం రూ.20 లక్షలు లంచంగా ఇచ్చారని పోలీస్ అధికారి జానీ చెప్పాడు. మూడు, నాలుగు లక్షలకు సీనియర్ పోలీసు అధికారులు ఒప్పుకోరని అన్నాడు. అలాగే ఈ వ్యవహారాన్ని ఈడీకి బదిలీ చేస్తామని ఇన్స్పెక్టర్ ఏఎం గోహిల్ బెదిరించాడు.
కాగా, కార్తీక్ తన న్యాయవాది సలహా మేరకు రేంజ్ ఐజీని సంప్రదించాడు. తన బ్యాంకు ఖాతాను అన్ఫ్రీజ్ చేయాలంటూ దరఖాస్తు సమర్పించాడు. దీంతో దీనిపై విచారణ జరుపాలని ఇన్స్పెక్టర్ ఎస్ఎన్ గోహిల్ను ఐజీ నీలేష్ జజాడియా ఆదేశించారు. అయితే పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్పెక్టర్ తరల్ భట్ అనేక బ్యాంకు ఖాతాల జాబితాను సిద్ధం చేశారని, అనుమానాస్పద లావాదేవీల సాకుతో వాటిని స్తంభింపజేయాలని ఇన్స్పెక్టర్ ఏఎం గోహిల్కు చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో విచారణ సాకుతో ముగ్గురు పోలీస్ అధికారులు కలిసి సుమారు 335 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు దర్యాప్తులో బయటపడింది.
మరోవైపు బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయిన ఖాతాదారులు తమ వద్దకు వచ్చినప్పడు వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసేందుకు ముగ్గురు పోలీస్ అధికారులు ప్రయత్నించినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో జునాగఢ్ స్పెషల్ ఆపరేషన్స్ సైబర్ క్రైమ్ సెల్ ఇన్స్పెక్టర్లు తరల్ భట్, ఏఎం గోహిల్, ఏఎస్ఐ దీపక్ జానీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే గోహిల్, జానీని సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.