ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన గుజరాత్ బీజేపీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు మంచులో ఇరుక్కుపోయారు. అయితే తామంతా క్షేమంగానే ఉన్నామని ఎమ్మెల్యే దుష్యంత్ పటేల్ ప్రకటించారు. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో భాగంగా గుజరాత్కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ అధిష్ఠానం ప్రచార బాధ్యతలు అప్పజెప్పింది. అల్మోరా, జాగేశ్వర్ ప్రాంత బాధ్యతలు వీరికి అప్పజెప్పింది. అయితే రెండు రోజులుగా అల్మోరాలో విపరీతమైన మంచు కురుస్తోంది. దీంతో ఈ 25 మంది ఎమ్మెల్యేలు ఈ మంచులో ఇరుక్కుపోయారు. దీనిపై ఎమ్మెల్యే దుష్యంత్ పటేల్ మాట్లాడుతూ..
‘ఉత్తరాఖండ్ ఎన్నికల్లో భాగంగా మా 25 మందికి అల్మోరా, జాగేశ్వర్లో ప్రచారం చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. అల్మోరాలో విపరీతమైన మంచు కురుస్తోంది. దీంతో మేం మధ్యలోనే ఆగిపోయాం. అల్మోరా, జాగేశ్వర్ ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. రోడ్డు మొత్తం మంచుతో కప్పబడింది. రెండు రోజులుగా ఇలా మంచు పడుతూనే వుంది. అయితే తాము క్షేమంగానే వున్నాం. మా మా ప్రచార స్థలాలకు చేరుకున్నాం’ అని దుష్యంత్ పటేల్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.