అహ్మదాబాద్, సెప్టెంబర్ 2: రెండు దశాబ్దాలకు పైగా గుజరాత్లో పాలన సాగిస్తున్న బీజేపీకి ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. రైతుల నుంచి మొదలు ఉద్యోగులు, వ్యాపారులు నిత్యం ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. పోలీసులే ప్రభుత్వంపై తిరగబడటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది. వచ్చే డిసెంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అన్నివర్గాల్లో భూపేంద్ర పటేల్ ప్రభుత్వంపై ఆగ్రహం పెల్లుబుకుతున్నది. 22 ఏండ్లుగా ప్రతిపక్షమే లేదన్నట్టు పాలన సాగిస్తూ.. రైతులు, ఉద్యోగులు, కార్మికులను నోరెత్తకుండా చేసిన బీజేపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. సకల వర్గాల్లో రగులుతున్న ఆగ్రహ మంటలకు భయపడి, వివిధ వర్గాల డిమాండ్ల పరిశీలనకు ప్రభుత్వం నలుగురు మంత్రులతో కమిటీ వేయాల్సి వచ్చింది.
గుజరాత్ ప్రభుత్వం మొదట తిరుగుబాటు చేసింది పోలీసులే. ఎంతోకాలం గా పెండింగ్లో ఉన్న తమ సమస్యలపై బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు కనీసం పట్టించుకోవటంలేదని ఆగ్రహించి నెల క్రితం మెరుపు సమ్మెకు దిగారు. దీంతో షాక్కు గురైన బీజేపీ సర్కారు.. పోలీసుల సంక్షేమానికి రూ.500 కోట్లు విడుదల చేసింది. డబుల్ ఇంజిన్ పాలనలో పరిస్థితి ఇలా ఉండగా, పోలీస్ వ్యవ స్థ పటిష్ఠానికి, సిబ్బంది సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్న తెలంగాణకు వచ్చి బీజేపీ నేతలు విమర్శలు చేయటం ఏంటని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం భారతీయ కిసాన్ సంఘ్ కూడా బీజేపీ ప్రభుత్వంపై పోరు సైరన్ మోగించింది. కఛ్, బన్స్కాంత జిల్లాల్లో అధిక విద్యుత్తు చార్జీలకు వ్యతిరేకంగా గురువారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. గుజరాత్లో ఒక్కో జిల్లాలో వ్యవసాయ మోటార్ల విద్యుత్తు చార్జీలు ఒక్కో రకంగా ఉంటాయి. రాష్ట్రంలో సగం కరెంటు అదానీ పవర్ నుంచే కొనుగోలు చేస్తుండటంతో చార్జీలపై ప్రభుత్వానికి అదుపులేకుండా పోయింది. దీంతో రాష్ట్రమంతా ఒకేరకం చార్జీలు వసూలు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణలో రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తుండగా, బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చి గప్పాలు కొట్టుకుంటున్నారు.
పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న 9 వేలమంది తలతీ కమ్ మంత్రి తమ డిమాం డ్ల సాధనకోసం పోరుబాట పట్టారు. ఈ ఉద్యోగుల దెబ్బకు ఏకంగా రెవెన్యూశాఖ మంత్రి జితేంద్ర ద్వివేదీ పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది.
గుజరాత్లో మాజీ సైనికోద్యోగులు కూడా బీజేపీ ప్రభుత్వంపై తిరగబడ్డారు. అమర జవాన్ల కుటుంబాలకు బీజేపీ ప్రభుత్వం రూ.1 లక్ష మాత్రమే ఎక్స్గ్రేషియా ఇస్తున్నది. ఇది అన్యాయమని, ఆ మొత్తాన్ని పెంచాలని 6 నెలలుగా వారు ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో ఉద్యమానికి భయపడి, బీజేపీ ప్రభుత్వం రూ.1 లక్ష ఎక్స్గ్రేషియాను రూ.1 కోటికి పెంచింది. డబుల్ ఇంజిన్ రాష్ట్రంలో ఎక్స్గ్రేషియా కోసం ఉద్యమాలు చేస్తుండగా, తెలంగాణలో అడగకుండానే అమర సైనికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటున్నది. తెలంగాణవారే కాకుండా ఏ రాష్ట్ర సైనికుడు చనిపోయినా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సైనికుడి కుటుంబాన్ని కలిసి ఎక్స్గ్రేషియా అందజేస్తున్నారు.
గుజరాత్లోని 26 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు ప్రభుత్వంపై పోరు మొదలుపెట్టారు. గుజరాత్ హెల్త్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంస్థ ఆధ్వర్యంలో గత నెల 8 నుంచి సమ్మె చేస్తున్నారు. తెలంగాణలో ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వం గౌరవంగా చూసుకొంటున్నది.
గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా పీఆర్సీ కోసం పోరుబాట పట్టారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, కాంట్రాక్టు వ్యవస్థను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ సోషల్మీడియాలో ప్రచారం చేపట్టారు. సింగిల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో ఉద్యోగులకు ఈ సమస్యలే లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు పీఆర్సీ కమిటీ సిఫారసులకంటే ఎక్కువగా ఉద్యోగులకు వేతనాలు పెంచింది. మొదటిసారి ఏకంగా 46 % పెంచటం తెలిసిందే.