అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టడంలో బిజీగా ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను ఓ ఆటో డ్రైవర్ తన నివాసంలో విందుకు ఆహ్వానించాడు. అహ్మదాబాద్లో సోమవారం ఆటో రిక్షా డ్రైవర్లతో జరిగిన సమ్మేళనంలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వారిలో ఓ డ్రైవర్ ఢిల్లీ సీఎంను తన ఇంటికి విందుకు రావాలని కోరాడు. తాను మీ అభిమానినని, పంజాబ్లో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో మీరు భోజనం చేసిన వీడియో చూశానని..అలాగే ఈరోజు డిన్నర్కు మా ఇంటికి వస్తారా అని డ్రైవర్ విక్రమ్ లల్తానీ అడిగాడు.
పంజాబ్లో లాగే గుజరాత్లోనూ ఆటో డ్రైవర్లు తనను అభిమానిస్తారని అంటూ విక్రమ్ విందు ఆహ్వానాన్ని కేజ్రీవాల్ మన్నించారు. మీ ఇంటికి తప్పకుండా డిన్నర్కు వస్తానని, రాత్రి 8 గంటలకు హోటల్ నుంచి నీ ఆటోలో నన్ను తీసుకువెళతావా అని అడగ్గా విక్రమ్ సంతోషంగా అంగీకరించాడు.
ఇక కేజ్రీవాల్ సాయంత్రం అహ్మదబాద్లో పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో సత్తా చాటాలని యోచిస్తున్న కేజ్రీవాల్ గత కొద్దినెలలుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను గెలిపిస్తే ఉచిత విద్యుత్, ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, మహిళలు, నిరుద్యోగ యువతకు ఆర్ధిక భరోసా కల్పిస్తామని కేజ్రీవాల్ హామీలు గుప్పించారు.