న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఇవాళ కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ ఒకటో తేదీన తొలి దఫా, అయిదవ తేదీన రెండో దఫా ఎన్నికలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తొలి విడుతలో 89 స్థానాలకు, రెండవ విడుతలో 93 స్థానాలకు పోలింగ్ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.
The date of counting for Gujarat Assembly polls will coincide with Himachal Pradesh on the 8th of December. The entire process of Assembly elections to be completed on the 10th of December: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/vafbfhJODH
— ANI (@ANI) November 3, 2022
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్నారు. జనరల్ 142, ఎస్టీ 13, ఎస్సీ 27 స్థానాలు ఉన్నట్లు సీఈసీ వెల్లడించారు. 51,782 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 17506, రూరల్ ఏరియాలో 34276 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 182 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,90,89765. దీంట్లో తొలిసారి 4,61,494 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాలు గెలుచుకున్నది. ఈ సారి కాంగ్రెస్, ఆప్, బీజేపీ మధ్య రసవత్తర పోరు తప్పదు. గుజరాత్ అసెంబ్లీ ఫిబ్రవరి 18, 2023లో ముగియనున్నది.
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు ప్రత్యేక అబ్జర్వర్ను ఏర్పాటు చేసినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మహిళలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. 4.90 కోట్ల మంది ఓటర్లలో పురుషులు 2.53 కోట్లు, మహిళలు 2.37 కోట్లు, మూడవ జెండర్కు చెందిన 1,417 మంది ఓటర్లు ఉన్నారు.