అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 56.88 శాతం పోలింగ్ నమోదైంది. తుది పోలింగ్ శాతం ఎంతనేది అధికారులు ఇంకా వెల్లడించలేదు. పలు పోలింగ్ బూత్ల్లో ఇంకా ఓటర్లు బారులు తీరి ఉన్నారు. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలోని 19 జిల్లాల్లో విస్తరించిన 89 స్ధానాల్లో తొలి విడత పోలింగ్ ముగిసింది. ఈవీఎంల మొరాయింపు, చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని ఈసీ వర్గాలు వెల్లడించాయి.
ఇక తొలి విడత పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అగ్ర నేతలు, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని హోరెత్తించాయి. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ ప్రచార ర్యాలీల్లో పాల్గొనగా, గుజరాత్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న ఆప్ తరపున ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుడిగాలి ప్రచారం చేశారు. ఇక పాలక బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పలు ర్యాలీల్లో పాల్గొన్నారు.
తొలి విడత పోలింగ్లో మొత్తం 788 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గట్లొదియ నుంచి పోటీ చేస్తుండగా, ఆప్ సీఎం అభ్యర్ధి ఇసుదన్ గధ్వి ఖంబలియ నుంచి బీజేపీ నేత హార్ధిక్ పటేల్ విరంగాం నుంచి రివబ జడేజా జామ్నగర్ (నార్త్) నుంచి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.