న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా నిరసన చేస్తున్న రెజ్లర్లను (wrestlers protest) హర్యానాకు చెందిన బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ సోమవారం కలిశారు. వారికి తన మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు తర్వాత దోషిని శిక్షించాల్సిందేనని అన్నారు. అలాగే రెజ్లర్లను కలిసిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న భారత కుమార్తెలు, కుమారులను కలిసినట్లు అందులో పేర్కొన్నారు.
కాగా, బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపించారు. ఆయనను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 23 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నారు. పలువురు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతోపాటు రైతు సంఘాల నేతలు రెజ్లర్లను కలిశారు. వారి నిరసనకు సంఘీభావం ప్రకటించారు.
మరోవైపు సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు. బ్రిజ్ భూషణ్పై రెండు కేసులు నమోదు చేశారు. మైనర్ మహిళా రెజ్లర్ను లైంగింగా వేధించారన్న ఆరోపణలపై పోక్సో చట్టంలోని సెక్షన్లను కూడా ఒక కేసులో చేర్చారు. గత వారం ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అయితే తనపై వచ్చిన లైంగిక వేధింపు ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించారు. రెజ్లర్ల ఎంపిక ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావడం వల్లనే తనపై ఈ ఆరోపణలు చేశారని ఆరోపించారు.
आज जन्तर मन्तर पर धरना दे रहे देश के पहलवान बेटे बेटियों से मुलाक़ात की। pic.twitter.com/ei9i8igPRO
— Birender Singh (@ChBirenderSingh) May 15, 2023