న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: పబ్లిక్ సర్వెంట్లపై అవినీతి, ఇతర నేరారోపణలు వచ్చినప్పుడు పోలీసులు విచారణ చేపట్టాలంటే ముందస్తు అనుమతి అవసరం. ఈ మేరకు 1988 నాటి అవినీతి నిరోధక చట్టానికి మూడేండ్ల కిందట ప్రభుత్వం సవరణ తెచ్చింది. ఇప్పుడు ఆ సవరణకు సంబంధించి అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులను (ఎస్వోపీ) కేంద్రం జారీ చేసింది. విచారణ, దర్యాప్తులో అన్నిచోట్లా ఒకే విధానాన్ని పాటించేలా చూడటమే ఎస్వోపీ లక్ష్యమని పేర్కొంది. ఈ ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శులకు పంపంది. పోలీసు అధికారికి అందిన సమాచారాన్ని ఎలా దశలవారీగా ప్రాసెస్ చేసుకోవాలి, ఎవరు ఎవర్ని ముందస్తు అనుమతిని కోరాలి తదితర వివరాలను పొందుపర్చారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల (బోర్డు స్థాయి) చైర్పర్సన్లు, మేనేజింగ్ డైరెక్టర్లకు సంబంధించి డైరెక్టర్ జనరల్ లేదా ఆ హోదాకు సమానస్థాయి అధికారి ముందస్తు అనుమతి కోరాల్సి ఉంటుందని ఎస్వోపీలో కేంద్రం స్పష్టం చేసింది.