న్యూఢిల్లీ, ఆగస్టు 29: మొన్నకిమొన్న పాలు, పాల పదార్థాలపై జీఎస్టీని బాది సామాన్యుడి నడ్డి విరిచిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు జీఎస్టీని వడ్డించేందుకు మరో కొత్త స్కీంను అమలు చేస్తున్నది. రైలు టికెట్లు క్యాన్సిల్ చేసుకొన్నా జీఎస్టీ కట్టాల్సిందేనని హుకుం జారీ చేసింది. పేదోడిని కొట్టి, పెద్దోనికి పెడుతున్న మోదీ సర్కారు.. రైలు సేవలు వద్దనుకొన్నా మాకు పన్ను కట్టి తీరాలని చెప్తున్నది. ఒక్క రైలు టికెట్ రద్దు చేసుకోవటమే కాదు.. విమాన టికెట్, హోటల్ టికెట్ రద్దు చేసుకొన్నా జీఎస్టీ కట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 2న కేంద్ర ఆర్థిక శాఖ ట్యాక్స్ రిసెర్చ్ యూనిట్ ఒక సర్క్యూలర్ కూడా జారీ చేసింది.
ఎందుకు జీఎస్టీ కట్టాలంటే..
టికెట్ రద్దు చేసుకొంటే జీఎస్టీ ఎందుకు కట్టాలనే వివరణ కూడా కేంద్రం ఇచ్చింది. ‘టికెట్ బుక్ చేసుకోవటం అంటే కాంట్రాక్టు తీసుకొన్నట్టే. అదే టికెట్ను రద్దు చేయటం అంటే ఒప్పందం చేసుకొన్న కాంట్రాక్టును ఉల్లంఘించినట్టే. కాబట్టి జీఎస్టీ కట్టి తీరాలి’.. ఇదీ కేంద్రం చెప్పే సాకు. టికెట్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావో సంబంధం లేకుండా 5 శాతం జీఎస్టీ కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. ‘వినియోగదారుడు కాంట్రాక్టును ఉల్లంఘిస్తే సర్వీస్ ప్రొవైడర్ క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేస్తాడు. ఇక్కడ క్యాన్సిలేషన్ చార్జీలు అంటే పేమెంట్ అన్నట్టే. ఆ పేమెంట్కు జీఎస్టీ కట్టాలి’ అని పేర్కొన్నది.
ఇదెక్కడి పన్ను
టికెట్ రద్దు చేసుకొన్నా జీఎస్టీ విధిస్తూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్పై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సేవలు పొందితే జీఎస్టీ విధించటం అంటే ఓ లెక్క. సేవలు వద్దన్నా పన్ను విధించటం దారుణం’ అని మండిపడుతున్నారు. ఓవైపు కరోనాతో ఆదాయం తగ్గటం, మరోవైపు నిత్యావసరాల వస్తువులపై జీఎస్టీ విధించటమే కాకుండా ఇప్పుడు కొత్తగా క్యాన్సిలేషన్కు కూడా జీఎస్టీ కట్టాలనటం క్రూరమైన చర్య అని పేర్కొంటున్నారు.