ముంబై, సెప్టెంబర్ 26: మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకురాలు పంకజ ముండేకు చెందిన చక్కెర ఫ్యాక్టరీలో జీఎస్టీ అధికారులు సోదాలు జరుపడం తీవ్ర చర్చనీయాంశమైంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలోనే సోదాలు జరిపినట్టు అధికారులు చెప్తున్నా అసలు విషయం వేరే ఉన్నదని రాజకీయ నాయకులు వెల్లడించారు. ఇటీవల మహారాష్ట్రలో మరాఠా కోటా, ఓబీసీ ఉద్యమం తీవ్రంగా సాగింది. ఓబీసీ వర్గానికి చెందిన పంకజ ముండే ఆ సమయంలో మౌనాన్ని వహించారు. ఉద్యమాలు సద్దుమణిగేలా చూడకుండా తీర్థయాత్రకు వెళ్లారు. దీంతో ఉద్యమాలకు పంకజ ముండే పరోక్షంగా మద్దతు తెలుపారని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది.
ఈ నేపథ్యంలోనే పంకజ ముండేకు చెందిన చక్కెర ఫ్యాక్టరీలో జీఎస్టీ అధికారులు సోదాలు జరిపారని విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు పంకజ ముండేను బీజేపీ అధిష్ఠానం టార్గెట్ చేయడానికి ఇంకో కారణం ఉన్నది. ఈమె తండ్రి దివంగత గోపీనాథ్ ముండే మహారాష్ట్రలోనే ప్రముఖ ఓబీసీ నాయకుడిగా ఎదిగారు. అద్వానీ, నితిన్ గడ్కరీ వర్గ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే ఎప్పుడైతే మోదీ-అమిత్ షా వర్గం ప్రాబల్యం పెరిగిందో అప్పటి నుంచి అద్వానీ-గడ్కరీ వర్గాన్ని అణగదొక్కడం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఇందులో భాగంగానే పంకజ ముండేను టార్గెట్ చేయడం.. ఫడ్నవీస్ వర్గాన్ని ప్రోత్సహించడం జరుగుతున్నదని వెల్లడించారు.