న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఆల్టైమ్ రికార్డు నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్లో దాదాపు రూ.1.68 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ఇది గత ఏడాది ఏప్రిల్లో వసూలైన మొత్తం కంటే 20% అధికం. ఈ ఏడాది మార్చిలో వసూలైన రూ.1,42,095 కోట్ల కంటే రూ.25,445 కోట్లు ఎక్కువ. జీఎస్టీ అమల్లోకి వచ్చాక వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లు దాటడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా గత నెల 20న కేవలం ఒక్కరోజులోనే 9.58 లక్షల లావాదేవీల ద్వారా రూ.57,847 కోట్ల జీఎస్టీ వసూలైంది. దీంతో మొత్తంగా ఏప్రిల్లో రూ.1,67,540 కోట్ల రాబడి వచ్చింది.
ఇందులో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) కింద రూ.33,159 కోట్లు, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) కింద రూ.41,793 కోట్లు, వస్తు దిగుమతులపై రూ.36,705 కోట్లతో కలిపి ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) కింద రూ.81,939 కోట్లు, సెస్ రూపంలో రూ.10,649 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్రకటించింది. దేశంలో వ్యాపార కార్యకలాపాలు పెరగడంతోపాటు పన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేయడం, సకాలంలో పన్ను చెల్లించనివారిపై కఠిన చర్యలు చేపడుతుండటం వల్లనే జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగినట్టు వివరించింది.
తెలంగాణలో 16% వృద్ధి
తెలంగాణలోనూ జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. ఏప్రిల్లో రూ.4,955 కోట్లు వసూలయ్యాయి. ఇది గత ఏడాది ఏప్రిల్లో వచ్చిన రూ.4,262 కోట్ల వసూళ్ల కంటే 16% అధికం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన రూ.4,067 కోట్ల వసూళ్ల కంటే రూ.888 కోట్లు ఎక్కువ.