చండీగఢ్, జూన్ 28: హోటల్లో రూ.వెయ్యి లోపు గదిని అద్దెకు తీసుకుంటున్నారా? అయితే, మీకో బ్యాడ్ న్యూస్. ఇప్పటివరకూ విలాసవంతమైన హోటల్ గదులపైనే జీఎస్టీ విధిస్తుండగా.. ఇప్పుడు సాధారణ స్థాయి గదులనూ పన్ను పరిధిలోకి తీసుకొస్తూ జీఎస్టీ కౌన్సిల్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆతిథ్య రంగం సహా వివిధ సేవలపై ఇస్తున్న జీఎస్టీ మినహాయింపులను ఎత్తివేసింది. పలు వస్తువులపై పన్ను రేట్లను సవరించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు, వివిధ రాష్ర్టాల ఆర్థికమంత్రులు హాజరై తమ ప్రతిపాదనలను కౌన్సిల్ ముందుంచారు. వీటిపై చర్చించిన కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.
రాష్ర్టాల వాటా పెంచండి
జీఎస్టీ రాబడిలో రాష్ర్టాలకు ఇస్తున్న 50 శాతం వాటాను 70-80 శాతానికి పెంచాలని విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల ప్రతినిధులు కౌన్సిల్ భేటీలో విజ్ఞప్తి చేశారు. రాష్ర్టాలకు జీఎస్టీ పరిహార చెల్లింపు గడువు ఈ నెలతో ముగియనున్న నేపథ్యంలో వ్యవధిని మరో ఐదేండ్లు పొడిగించాలని డి మాండ్ చేశారు. ఆర్థిక మండలిలో అధికార పక్షానికి మెజారిటీ ఉన్ని.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలే తీసుకోవాలని సూచించారు. కౌన్సిల్ తీసుకున్న అన్ని నిర్ణయాలకు రాష్ర్టాలు కట్టుబడి ఉండాల్సిన అవసరంలేదని, పార్లమెంట్, రాష్ర్టాల శాసనసభలకు సైతం జీఎస్టీపై చట్టాలు చేసుకొనే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పును ఈ సందర్భంగా ఉటంకించారు. పరిహారం పొడిగింపు డిమాండ్తో పాటు క్యాసి నో, ఆన్లైన్ గేమ్, గుర్రపు పందేలపై 28% పన్ను విధింపు తదితరాలపై బుధవారం జరిగే కౌన్సిల్ భేటీలో నిర్ణయం వెలువడొచ్చని సమాచారం.
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు