భూపాల్: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్దీవదేహానికి ఇవాళ మధ్యప్రదేశ్లోని భూపాల్లో అంత్యక్రియలు నిర్వహించారు. హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ రావత్ దంపతులు ప్రాణాలు కోల్పొయిన విషయం తెలిసిందే. పూర్తి సైనిక లాంఛనాలతో కెప్టెన్ వరుణ్ సింగ్ అంత్యక్రియలను చేపట్టారు. త్రివర్ణ రంగు జెండాతో మిలిటరీ హాస్పిటల్ నుంచి బైరాఘర్ శ్మశాన వాటికకు వరుణ్ శవపేటికను తీసుకువచ్చారు. శవ ఊరేగింపు సమయంలో భారత్ మాతా కీ జై నినాదాలు మారుమోగాయి. శ్మశానవాటిక వద్ద రక్షణ దళాలు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించాయి. సీనియర్ సర్వీస్ ఆఫీసర్లు పుష్పాలతో నివాళి అర్పించారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, వైద్యశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్లు కూడా నివాళి అర్పించారు. డిసెంబర్ 8వ తేదీ జరిగిన ప్రమాదంలో వరుణ్ సింగ్ గాయపడ్డారు.