భువనేశ్వర్ : ఓ యువకుడి నిశ్చితార్థం వేళ విషాదం చోటు చేసుకుంది. డీజే హోరుకు ఆ యువకుడి తండ్రి గుండె ఆగింది. ఈ విషాద ఘటన ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి సోషల్ మీడియాలో మల్కన్గిరి అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు తమ కుటుంబ సభ్యులను ఒప్పించి, పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిశ్చితార్థం కోసం యువకుడి కుటుంబం బుధవారం సాయంత్రం మల్కన్గిరికి చేరుకుంది. అక్కడ ఓ హోటల్లో దిగారు. నిశ్చితార్థం నిమిత్తం యువతి ఇంటికి వెళ్లేందుకు యువకుడి కుటుంబ సభ్యులు హోటల్ నుంచి బయటకు వచ్చారు. వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన యువతి బంధువులు డీజే చప్పుళ్లతో హంగామా చేశారు. ఆ డీజే హోరుకు యువకుడి తండ్రి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.