లక్నో: అదనంగా కట్నం అడిగిన వరుడ్ని పెండ్లిలో వధువు బంధువులు చితకబాదారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి సాహిబాబాద్ ప్రాంతంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఒక పెండ్లి వేడుక జరుగుతున్నది. ఆగ్రాకు చెందిన వరుడు ముజమ్మిల్ తండ్రి పెండ్లిలో పది లక్షల అదనపు కట్నం డిమాండ్ చేశాడు. లేకపోతే వివాహాన్ని ఆపివేస్తామని బెదిరించాడు.
కాగా, వధువు కుటుంబం అప్పటికే మూడు లక్షల కట్నంతోపాటు లక్ష విలువైన డైమండ్ రింగ్ను వరుడికి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పెండ్లి సజావుగా జరిపించాలని వధువు కుటుంబ సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వరుడితోపాటు ఆయన కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది.
దీంతో ఆగ్రహించిన పెండ్లి కుమార్తె కుటుంబ సభ్యులు పెండ్లి కొడుకుపై దాడి చేశారు. అంతా చూస్తుండగా వరుడ్ని చితకబాదారు. చివరకు వరుడి కుటుంబానికి చెందిన ఒక మహిళ జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. అనంతరం ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. కాగా, వరుడికి అప్పటికే రెండు మూడు వివాహాలు అయినట్లు వధువు కుటుంబం ఆరోపించింది.
మరోవైపు పెండ్లికి హాజరైన వారితోపాటు ఫంక్షన్ హాల్ సిబ్బంది తమ మొబైల్లో తీసిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.