లక్నో : కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపింది. ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది.కుటుంబాలకు కుటుంబాలను కోనా బలి తీసుకున్నది.. . విషాదఛాయలను నింపింది. అలా ఉత్తరప్రదేశ్లోని ఓ ఉమ్మడి కుటుంబంపై కరోనా పంజా విసిరింది. కేవలం 24 రోజుల్లోనే 8 మందిని పొట్టన పెట్టుకుంది. సరాసరి మూడు రోజులకు ఒకరిని కరోనా కాటేసింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులతో పాటు వారి అమ్మ, అత్త ఉన్నారు. ఈ 8 మందిలో కొందరు ఆక్సిజన్ అందక ఆస్పత్రుల్లో చనిపోయారు. కొందరూ ఇంట్లోనే ఊపిరి వదిలారు. ఈ హృదయ విదారక ఘటన గతేడాది ఏప్రిల్ మాసంలో ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా నాటి బాధలను బాధిత కుటుంబాలు గుర్తు చేసుకున్నాయి.
నా పేరు సీమా సింగ్ యాదవ్.. నా భర్త నిరంకర్ సింగ్. వృత్తి రీత్యా రైతు. ఆయన కరోనాతో పోరాడి ఓడిపోయారు. ఆరు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది గతేడాది ఏప్రిల్ 25న చనిపోయాడు. ఆక్సిజన్ అందకనే మా ఆయన ప్రాణాలొదిలాడు. ఆక్సిజన్ సరఫరా పెంచాలని డాక్టర్ను వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నా కళ్ల ముందే నా భర్త చనిపోవడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. నా పిల్లల కోసమే నేను బతుకుతున్నాను. పెద్ద కొడుకు(21) హైదరాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తున్నాడు. చిన్నోడు(19) 12వ తరగతి పరీక్షలు రాశాడు. పొలం పనుల్లో నాకు సహాయం చేస్తున్నాడు. పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. నేను కూడా పూర్తిగా అనారోగ్యానికి గురయ్యాను. కానీ పిల్లల కోసమే బతుకుతున్నాను. వారి జీవితాలకు ఆటంకం కలిగించాలనుకోవడం లేదు.. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను అని సీమా సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు.
నా పేరు కుస్మా దేవి.. మా ఆయన విజయ్ కుమార్ సింగ్ను కరోనా తీసుకెళ్లింది. పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత మే 1న కుమార్ సింగ్ కన్నుమూశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాం. ఇల్లు ఎలా నడపాలి.. పిల్లలను ఎలా చదివించాలని ఆలోచిస్తున్నాను. పిల్లల చదువులు చాలా ముఖ్యమైనవి. ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చినప్పటికీ.. భవిష్యత్ గురించి తలచుకుంటేనే ఆందోళన కలిగిస్తోంది అని కుస్మా దేవి కన్నీరు పెట్టుకున్నారు.