న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ( Omicron ) ప్రపంచాన్ని వణికిస్తుండటంతో అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభ తేదీపై సమీక్షిస్తున్నది. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి సుమారు 20 నెలలుగా అంతర్జాతీయ విమానాలను నడపడం లేదు. 31 దేశాలతో బబుల్ ఒప్పందం మేరకు గత ఏడాది జులై నుంచి కొన్ని సర్వీసులు నడుస్తున్నాయి. కాగా, దేశంలో కరోనా పరిస్థితి అదుపులోకి రావడంతో డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని ఈ నెల 26న కేంద్రం ప్రకటించింది.
మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పలు దేశాల్లో అలజడి రేపుతున్నది. ఈ కొత్త వేరియంట్ ఇతర కోవిడ్ వేరియంట్ల కంటే ప్రాణాంతకమని, వేగంగా వ్యాపిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభ తేదీ, వ్యూహంపై ఆదివారం సమీక్షించింది.
కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న కరోనా వేరియంట్ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయాన్ని సమీక్షించారు. నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్, ప్రధానమంత్రి ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు విజయ్ రాఘవన్, ఆరోగ్యం, పౌర విమానయానం, ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో సహా వివిధ రంగాల నిఫుణులు ఇందులో పాల్గొన్నారు.