న్యూఢిల్లీ : భారత్లో 2022లో నమోదైన కొవిడ్-19 మృతుల్లో 92 శాతం టీకా తీసుకోని వారే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని ఈ దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కీలక పాత్ర పోషించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. భారత్లో కొవిడ్-19 కేసుల్లో భారీ తగ్గుదల నమోదవుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా రోజుకు సగటున దాదాపు 11,000 కొవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో భారత్ నుంచి కేవలం 0.7 కేసులే వెలుగుచూస్తున్నాయని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో మరణాల సంఖ్య తక్కువగా ఉందని, ఇది సానుకూల పరిస్ధితికి సంకేతమని ఆయన చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 2-8 వరకూ సగటున 615 మరణాలు నమోదవగా గత వారం సగటున 144 మరణాలు వెలుగుచూశాయని తెలిపారు. దీంతో కొవిడ్-19 ముమ్మర దశ కంటే 76.6 శాతం తీవ్రత తగ్గినట్టు వెల్లడవుతోందని అన్నారు. వారంలో సగటు కరోనా పాజిటివిటీ రేటు 0.99 శాతానికి పడిపోయిందని చెప్పారు.
గడిచిన 24 గంటల్లో తాజాగా కేవలం 6561 కేసులు నమోదయ్యాయని అన్నారు. దేశంలో యాక్టివ్ కేసుల్లో సగం కేసులు మహారాష్ట్ర, కేరళ, మిజోరాం రాష్ట్రాల నుంచే ఉన్నాయని చెప్పారు. టీకా డోసులు ముమ్మరంగా చేపట్టడంతోనే దేశంలో కరోనా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పేర్కొన్నారు. మరణాలను నిరోధించడంలో వ్యాక్సిన్ సామర్ధ్యం విలువైనదని తేలిందని అన్నారు. టీకా రెండు డోసులు తీసుకుంటే సామర్ధ్యం 99.3 శాతంగా ఉందని, సింగిల్ డోసు తీసుకున్న వారిలో వ్యాక్సిన్ సామర్ధ్యం 98.9 శాతంగా ఉందని చెప్పారు.