Parliament | న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎస్ఎఫ్)తో పార్లమెంట్ భవనానికి పూర్తిస్థాయిలో సమర్థవంతమైన భద్రతను ఏర్పాటుచేసే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల పార్లమెంట్లో భద్రతా వైఫల్యం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో పాత, కొత్త పార్లమెంట్ భవనాల వద్ద భద్రతా నిర్వహణను సీఐఎస్ఎఫ్కు అప్పగించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
హ్యాండ్ డిటెక్టర్స్, ఎక్స్-రే మెషీన్లతో పరీక్షలు జరపటం, బూట్లు, దళసరి జాకెట్లు, బెల్ట్లు.. మొదలైన వాటిని స్కానర్లో పంపటం.. విమానాశ్రయాల వద్ద ప్రయాణికులను స్కానింగ్ చేసినట్టు పార్లమెంట్ భవనం వద్ద భద్రతా చర్యల్ని ఇకపై సీఐఎస్ఎఫ్ చేపట్టే అవకాశముంది. ఇందుకు సంబంధించి సర్వే చేపట్టాల్సిందిగా కేంద్ర హోం శాఖ నుంచి బుధవారం ఆదేశాలు వెలువడ్డాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ సిబ్బంది పార్లమెంట్ భవనాల వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నది. డిసెంబర్ 13న ఇద్దరు వ్యక్తులు లోక్సభ గ్యాలరీ నుంచి లోక్సభ చాంబర్లోకి దూకి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో కర్ణాటకకు చెందిన మాజీ పోలీస్ అధికారి (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) కుమారుడు సాయిక్రిష్ణ జాగలిని ఢిల్లీ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. బాగల్కోట్లోని అతడి ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. మైసూర్కు చెందిన ఇతడు బెంగళూర్లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, పార్లమెంట్ చొరబాటు కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న మనోరంజన్కు సాయిక్రిష్ణ స్నేహితుడని పోలీసులు తెలిపారు. కాలేజీ రోజుల్లో మనోరంజన్ రూమ్మేట్గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.