న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జేఈఈ (మెయిన్), నీట్ను సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్)లో విలీనం చేసి ఒకే పరీక్షను నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) యోచిస్తున్నది. వచ్చే ఏడాది నాటికి ఈ ఇంటిగ్రేటెడ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు యూజీసీ చైర్పర్సన్ ఎం జగదీశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ‘నీట్, జేఈఈ (మెయిన్), సీయూఈటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్కు విద్యార్థులు పెద్దయెత్తున దరఖాస్తు చేస్తున్నారు. ఈ మూడు పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తున్నది. కాబట్టి, సీయూఈటీలో వచ్చిన స్కోర్ను ఇంజినీరింగ్, మెడిసన్ ప్రవేశాల కోసం ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదు అని యోచిస్తున్నాం. నీట్ పరీక్షలో బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుగా ఉంటాయి. జేఈఈలో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. అయితే, ఈ ఆరు సబ్జెక్టులు సీయూఈటీలో కూడా ఉన్నాయి. కాబట్టి, సీయూఈటీ స్కోరును ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం పరిగణించడంలో ఇబ్బందులు ఏమీ ఉండవని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఒకటికి మించి ఎంట్రెన్స్ టెస్టులకు హాజరవ్వడం విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నదని, తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, విద్యార్థులకు ఉపశమనం లభిస్తుందన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020లో ‘వన్ నేషన్.. వన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్’ను ప్రతిపాదించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంటిగ్రేటెడ్ ఎగ్జామ్ నిర్వహణ అంశంపై చర్చించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. కమిటీ సిఫారసులను సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు.