న్యూఢిల్లీ: కోవిడ్ టీకాలను ఖరీదు చేసేందుకు వివిధ కంపెనీలకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 25 కోట్ల డోసుల కోవీషీల్డ్, 19 కోట్ల డోసుల కోవాగ్జిన్కు ఆర్డర్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బయోలాజికల్ ఈ వద్ద 30 కోట్ల డోసుల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆ వ్యాక్సిన్లు సెప్టెంబర్ వరకు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లకు ఇచ్చే వ్యాక్సిన్ల ధరలను వ్యాక్సిన్ ఉత్పత్తిదారులే నిర్ణయిస్తారని పౌల్ తెలిపారు. ప్రైవేటు హాస్పిటళ్లకు కావాల్సిన వ్యాక్సిన్ డోసుల గురించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తాయని, ఎంత వరకు సదుపాయాలు ఉన్నాయని, ఎన్ని డోసులు అవసరం వస్తుందో ఆయా రాష్ట్రాలే నిర్ణయిస్తాయని డాక్టర్ వీకే పౌల్ అన్నారు.
థార్డ్ వేవ్.. పిల్లలపై ప్రభావం ఉండదు..
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్త గా 86,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దాదాపు కేసులు 79 శాతం తగ్గినట్లు ఆయన చెప్పారు. గత వారంలో 33 శాతం కేసులు తగ్గాయని, గడిచిన నెల రోజుల్లో 322 జిల్లాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. కోవిడ్తో పిల్లలు సతమతం అవుతున్న అంశంపై ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. పిల్లలపై కోవిడ్ పెను ప్రభావం చూపినట్లు ఎక్కడా డేటా అందుబాటులో లేదన్నారు. ఇండియాలో కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ పిల్లలపై వైరస్ ప్రభావం అంతగా లేదన్నారు. ఇండియాలో సెకండ్ వేవ్ సమయంలో పిల్లల్లో చాలా స్వల్ప స్థాయిలో ఇన్ఫెక్షన్ కేసులు నమోదు అయ్యాయని, లేదా ఇతర రుగ్మతులు ఉన్నవారిలో మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్తులో చిన్నారులకు సీరియస్గా ఇన్ఫెక్షన్ ఉంటుందని అనుకోవడం లేదని డాక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు.