న్యూఢిల్లీ, మే 21: మన ఫోన్కు ఎవరైనా అపరిచితులు ఫోన్చేస్తే వారి వివరాలు తెలుసుకొనేందుకు సాధారణంగా చాలామంది ట్రూ కాలర్ వంటి యాప్స్ వాడుతుంటారు. మన ఫోన్బుక్లో వాళ్ల పేరు లేకున్నా కాలర్ వివరాలు ట్రూకాలర్లో తెలిసిపోతాయి. త్వరలో ట్రూకాలర్ లాంటి థర్డ్పార్టీ యాప్స్తో పనిలేకుండా కాలర్ వివరాలు తెలిసే వ్యవస్థను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) రూపొందిస్తున్నది. మనం మొబైల్ సిమ్ కొన్నప్పుడు సమర్పించిన వ్యక్తిగత వివరాల (కేవైసీ) ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని ట్రాయ్ అధికారులు తెలిపారు. దీని రూపకల్పనపై ఇప్పటికే కేంద్ర టెలికం శాఖతో చర్చలు జరిపామని, మరో మూడు నెలల్లో టెలికం వర్గాలన్నింటితో చర్చలు మొదలవుతాయని ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా వెల్లడించారు.