12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ చిలికి చిలికి గాలి దుమారంగా మారుతోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సహా, ఇతర పార్టీల నేతలు కూడా ఈ అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. పార్లమెంట్ను నడపడం కేంద్రానికి రావడం లేదని రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ఏ అంశంపై నైనా చర్చించడానికి తాము సదా సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు. పశ్చాత్తాపం, విచారం వ్యక్తం చేసి, సభకు రావాలని ఆ నేతలకు తాను పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఇంత గందరగోళంలో పార్లమెంట్ ఎందుకు నడుపుతున్నారని అడుగుతున్నారని, కానీ ఈ రోజు మొత్తం 50 మంది ఎంపీలు జీరో అవర్ కోసం నోటీసులు ఇచ్చారని ఆయన తెలిపారు. వాటిలో 26 మంది ఎంపీల అభ్యర్థనను స్పీకర్ ఆమోదించారు. టీఎంసీ, బీఎస్పీ, బీజేడీ, వైఎస్సార్సీపీ, ఇంకొన్ని పార్టీలు పాల్గొన్నాయని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.