న్యూఢిల్లీ: ఈ నెల 30న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుందని విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అన్ని పార్టీలతో ఈ నెల 30న సమావేశం కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు అన్ని పార్టీలకు ఆహ్వానం పంపనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఈ సమావేశాల సందర్భంగా ఉభయసభల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులు, చేయబోయే చట్టాలు తదితర అంశాలపై ఆల్పార్టీ మీట్లో చర్చించే అవకాశం ఉన్నది.
కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 ప్రారంభమై ఏప్రిల్ 6న ముగియనున్నాయి. అయితే, ఈ తేదీల మధ్య ఏకధాటిగా కాకుండా రెండు విడతల్లో బడ్జెట్ సెషన్ కొనసాగనుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.