న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కార్పొరేట్ శక్తుల నియంత్రణ పెరిగిందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. కార్పొరేట్ల ఆదేశాల మేరకు మోదీ సర్కార్ పనిచేస్తున్నదని, 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోను రైతులెవరూ నమ్మడం లేదని అన్నారు. కార్పొరేట్ల గ్యాంగ్ బీజేపీని కబ్జా చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. రాకేశ్ టికాయిత్ బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేంద్ర సర్కార్ తీరుపై ధ్వజమెత్తారు. బీజేపీ మ్యానిఫెస్టోను తాము నమ్మడం లేదని పేర్కొన్నారు.
2014 లోక్సభ ఎన్నికల సమయంలో పంటలకు కనీస మద్దతు ధరపై(ఎంఎస్పీ) స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, అయితే పదేండ్లయినా ఆ హామీని అమలు చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. ప్రజలను మోసగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేశామని అబద్ధాలు చెప్పుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2047 లక్ష్యాల గురించి ప్రధాని చెప్తుంటారని, వారు(బీజేపీ) చెప్పే ఉద్దేశాల్లో విజయం సాధిస్తే, 70 శాతం దేశం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని, భూమే వాళ్ల తదుపరి లక్ష్యంగా మారుతుందని టికాయిత్ పేర్కొన్నారు. భూ హక్కులపై కూడా పోరాటం చేస్తామని తెలిపారు