Railway Board | న్యూఢిల్లీ, జూన్ 8: ప్రతి రైలు ప్రమాదం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషన్ (సీఆర్ఎస్) రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది. నివేదిక చేతిక అందాక ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైల్వే మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పిస్తుంది. వీటిలో లెవల్ క్రాసింగులు, అప్గ్రేడింగ్, ట్రాక్ నిర్వహణకు సంబంధించి అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, సిగ్నలింగ్, ఇంటర్లాకింగ్ వ్యవస్థ వంటివి ఉంటాయి. వీటిపై రైల్వే బోర్డు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గతంలో జరిగిన 15 ప్రమాదాలపై 135 ప్రతిపాదనలతో సీఆర్ఎస్ ఇచ్చిన నివేదిక రైల్వే బోర్డు వద్ద ఇప్పటికీ పెండింగులో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. యాక్షన్ టేకెన్ రిపోర్టుల విషయంలో నిర్ణీత కాలవ్యవధి లేకపోవడమే ఇందుకు కారణం. 2021-22 సంవత్సరాంతంలో రైల్వే మంత్రిత్వశాఖ నుంచి 14 యాక్షన్ టేకెన్ రిపోర్టులు మాత్రమే అందగా మరో 15 ప్రమాదాలకు సంబంధించి పెండింగులో ఉన్నాయి.
వీటిలో 2013-14లో జరిగిన ప్రమాదం కూడా ఉండడం గమనార్హం. సీఆర్ఎస్ చేసిన ప్రతిపాదనలపై చర్యలు తీసుకుని ఉంటే కనుక బాలాసోర్ దుర్ఘటన జరిగి ఉండేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైల్వేకు ఉన్న విస్తృత నెట్వర్క్ కారణంగా సీఆర్ఎస్ సూచించిన మార్పులు చేయడంలో జాప్యం సర్వసాధారమేనని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రైల్వే భద్రతకు సంబంధించి నిబంధనలు అమలు చేయడానికి వివిధ స్థాయిల్లో చర్చలు అవసరమని, అందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గినప్పటికీ ప్రయాణికులతో వెళ్లే రైళ్లు పట్టాలు తప్పుతుండడం ఆందోళన కలిగిస్తున్నదని సీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ 2న ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 288 మందికిపైగా మరణించారు. ఈ ఘటనపైనా సీఆర్ఎస్ విచారణ ప్రారంభించింది.