లక్నో: రాజకీయాల్లో ప్రతి ఒక్కరు సవాళ్లను స్వీకరించాల్సిందేనని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, ఆగ్రా రూరల్ బీజేపీ అభ్యర్థి బేబీ రాణి మౌర్య (Baby Rani Maurya) అన్నారు. రాష్ట్రంలో మెరుగైన పాలనకోసం ప్రజలు బీజేపీకి ఓట్లు వేస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె ఆగ్రాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎదురయ్యే సవాళ్లను ప్రతిఒక్కరు స్వీకరించాలన్నారు. ఈసారికూడా ఆగ్రాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘గత ఎన్నికల్లో ఆగ్రా జిల్లాలోని తొమ్మిది స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఈ సారికూడా అదే జరుగుతుంది. తొమ్మిదికి తొమ్మిది స్థానాల్లో తామే విజయం సాధిస్తాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మాయావతి ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ సాయం చేసింది. నన్ను ఉత్తరాఖండ్ గవర్నర్గా నియమించింది. మహిళల అభివృద్ధికి బీజేపీలా మరేపార్టీ పాటుపడలేదు’ అని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. తొలి దశలో 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనున్నది. మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
2017లో ఈ 58 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 53, ఎస్పీ 2, బీఎస్పీ 2, ఆర్ఎల్డీ ఒక సీటును గెలుచుకున్నాయి. ఇక్కడ జాట్ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో వీరు ప్రధాన పాత్ర పోషించారు.
403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి గురువారం నుంచి మార్చి 7 మధ్య ఏడు విడుతల్లో పోలింగ్ జరుగనున్నది. మిగతా నాలుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, గోవాలో 14న, పంజాబ్లో 20న, మణిపూర్లో ఈ నెల 27, మార్చి 3న పోలింగ్ జరుగనున్నది. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.