PM Modi | న్యూఢిల్లీ: అవినీతికి ప్రధాని మోదీ వ్యతిరేకం కాదని, తాను గతంలో అవినీతిపై చేసిన ఫిర్యాదులను ఆయన బుట్టదాఖలు చేశారని జమ్ముకశ్మీర్ మాజీ లెప్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. సత్యపాల్ మాలిక్ వద్ద గతంలో విధులు నిర్వర్తించిన వారిపై సీబీఐ బుధవారం దాడులు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఫిర్యాదు చేసిన వారిపైనే సీబీఐ దాడులు చేస్తున్నదన్నారు. తనను కేంద్రం టార్గెట్ చేసిందని, భయపెట్టేందుకే దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు.
ఢిల్లీలో పది, రాజస్థాన్లో రెండు ప్రాంతాల్లో బుధవారం సీబీఐ తనిఖీలు నిర్వహించింది. మాలిక్ వద్ద గతంలో ప్రెస్ సలహాదారుడిగా చేసిన సునాక్ బాలి, సీఏ, పీఏలుగా వ్యవహరించిన వీఎస్ రాణా, కేఎస్ రాణాలకు చెందిన ఇండ్లపై దాడులు నిర్వహించారు. జమ్ముకశ్మీర్లోని కిరు జల విద్యుత్ కేంద్ర ప్రాజెక్టు, ఉద్యోగుల ఇన్సూరెన్స్ కేసులకు సంబంధించి ఈ దాడులు చేసినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కిరు జల విద్యుత్తు కేంద్ర ప్రాజెక్టు చైర్మన్ నవీన్ కుమార్ చౌదరీ, ఇతర డైరెక్టర్ల ఇండ్లపై కూడా సీబీఐ దాడులు చేసింది.