West bengal | సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్కర్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. గవర్నర్ ధన్కర్ ప్రతిరోజూ ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తుంటారని, అలాగే భయపెడుతూ కూడా ట్వీట్లు చేస్తారని మమతా బెనర్జీ ఆరోపించారు. దీంతో గవర్నర్ను ట్విట్టర్ ప్లాట్ఫామ్పై బ్లాక్ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అయితే ఈ ఆరోపణలను గవర్నర్ ధన్కర్ తోసిపుచ్చారు. తానెలాంటి ట్వీట్లు చేయలేదని, అలాంటి ఒక్క ట్వీట్ కూడా తాను చేయలేదని గవర్నర్ ధన్కర్ స్పష్టం చేశారు. బెంగాల్లో పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా సాగడంలేదని, అందుకే తాను జోక్యం చేసుకోవాల్సి వస్తోందన్నారు. అలాగే ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు తన వద్ద ఎలాంటి ఫైళ్లూ పెండింగ్లో లేవని, ఒకవేళ పెండింగ్లో ఉందని వారు వాదిస్తే, దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి వుంటుందని ధన్కర్ కౌంటర్ ఇచ్చారు.