నీట్ అంశంలో గవర్నర్ రవి తీరుపై ఆగ్రహం
‘ఎట్ హోమ్’ కార్యక్రమం బహిష్కరణ
డీఎంకే, సీపీఎం, కాంగ్రెస్ నేతల గైర్హాజరు
బిల్లుపై గవర్నర్ హామీ ఇవ్వట్లేదని మండిపాటు
రాజ్భవన్ ద్వారా బీజేపీ పాలిటిక్స్: నెటిజన్ల ఫైర్
చెన్నై, ఏప్రిల్ 14: నీట్ బిల్లు విషయంలో తమిళనాడు గవర్నర్ తీరుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం భగ్గుమన్నది. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీ ఆమోదించిన రెండో బిల్లుపై కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న రాజ్భవన్ను కూడా తాము బహిష్కరిస్తున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో తమిళ సంవత్సరాదిని పురస్కరించుకొని గురువారం రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఎట్హోం కార్యక్రమానికి హాజరుకాలేదు.
అధికార డీఎంకేతో పాటు మిత్రపక్షాలు కాంగ్రెస్, సీపీఎం నేతలు కూడా డుమ్మా కొట్టారు. అంతకుముందు ఎట్హోం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు పరిశ్రమల మంత్రి తంగం తెన్నరసు మీడియాకు తెలిపారు. ఆ కార్యక్రమానికి హాజరైతే రాష్ట్రంలోని ప్రజల మనోభావాలతో పాటు శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన అసెంబ్లీ గౌరవం దెబ్బ తింటుందని పేర్కొన్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన నీట్ బిల్లుకు బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు, రాజ్భవన్ను అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని, ఇందులో భాగంగానే నీట్ బిల్లు ఆమోదంపై గవర్నర్ తాత్సారం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అసలేం జరిగిందంటే?
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలంటూ తమిళనాడు అసెంబ్లీలో గత ఏడాది సెప్టెంబర్లో ప్రభుత్వం బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపించింది. అయితే దీనిపై ఎటూ తేల్చకుండా తాత్సారం చేశారు. విమర్శలు రావడంతో చివరకు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నదంటూ ఆ బిల్లును అసెంబ్లీ పరిశీలనకు గవర్నర్ తిరిగి పంపారు. దీంతో మరోసారి రెండో బిల్లును ఫిబ్రవరిలో అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపారు. అయితే, దీనిపై రాజ్భవన్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో రెండో బిల్లు విషయంపై చర్చించేందుకు మంత్రులు తంగం తెన్నరసు, మా సుబ్రమనియన్.. గవర్నర్ రవిని గురువారం కలిశారు. అయితే ఈ బిల్లు ఇంకా తన పరిశీలనలోనే ఉందని గవర్నర్ చెప్పినట్టు తెన్నరసు మీడియాకు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎట్ హోం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్కు కూడా తెలియజేసినట్టు వెల్లడించారు. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లును పంపిస్తానంటూ సీఎం స్టాలిన్తో గవర్నర్ గతంలో చెప్పారని, ఇప్పుడు ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగానికి లోబడి గవర్నర్ తన విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు. బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించాల్సిందేనని తేల్చిచెప్పారు. నీట్ బిల్లుపై తాత్సారం చేయడాన్ని నిరసిస్తూ డీఎంకే, సీపీఎం, కాంగ్రెస్ నేతలు ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరుకాలేదు.
ఏమిటీ ‘నీట్’ వివాదం
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘నీట్’లో ఉత్తీర్ణత సాధించలేకపోతామేమోనన్న భయంతో తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ధనుష్, అనూష అనే స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకొన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దయెత్తున వివాదం చెలరేగింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థుల ప్రయోజనార్థం ‘నీట్’ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గత సెప్టెంబర్లో ‘నీట్’పై ఓ బిల్లు తీసుకొచ్చింది. 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్యవిద్య కోర్సుల్లో అవకాశాలు కల్పించనున్నట్టు ఆ బిల్లులో పేర్కొంది. అయితే ఈ బిల్లు ఆమోదానికి గవర్నర్ కొర్రీలు పెడుతున్నారు.
రాజ్యాంగం ప్రకారం..
సాధారణంగా అసెంబ్లీ పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిస్తారు. ఒకవేళ వెనక్కి పంపిన బిల్లు మళ్లీ గవర్నర్ దగ్గరికి గనుక వస్తే మాత్రం.. దానిపై గవర్నర్ ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతికి పంపించాలి. ఆపై తుది నిర్ణయం రాష్ట్రపతికే ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు.