కోల్కతా : పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ మరోసారి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ, సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. స్పీకర్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని, తాను కోరిన సమాచారం ఇవ్వలేదంటూ మండిపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా అసెంబ్లీ కాంప్లెక్స్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ధన్కర్ విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ గురించి ఏదైనా మాట్లాడేందుకు స్పీకర్కు లైసెన్స్ ఉందా అని ప్రశ్నించారు. ఏం మాట్లాడినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బీఎస్ఎఫ్ కార్యకలాపాల విస్తరణపై అసెంబ్లీ తీర్మానం వివరాలతో సహా అనేక సందర్భాల్లో స్పీకర్ తనకు కోరిన సమాచారం ఇవ్వలేదని గవర్నర్ ధన్కర్ ఆరోపించారు. అసెంబ్లీలో తన ప్రసంగాన్ని రెండుసార్లు బ్లాక్ అవుట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఆర్టికల్ 168 తెలియదా? అని ప్రశ్నించారు. శాసనసభలో గవర్నర్ నంబర్ వన్, సభలో రెండో వ్యక్తి స్పీకర్ అన్న ఆయన.. ఇక నుంచి గవర్నర్ ప్రసంగాన్ని స్పీకర్ బ్లాక్ అవుట్ చేయలేరన్నారు. అలా చేస్తే చట్టాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అసెంబ్లీలోని లాన్లో స్పీకర్ కొద్ది అడుగుల వెనుక నిలబడి ఉండగానే ధన్కర్ విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్లో ప్రజలు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునే స్వేచ్ఛ లేదని విమర్శించారు. ఎన్నికల తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో హింసాత్మక సంఘటనలు చేసుకున్నాయన్నారు. తమ ఇష్టానుసారం ఓటు వేసేందుకు సాహించిన వారు తమ ప్రాణాలనే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని గవర్నర్ వ్యాఖ్యానించారు.