పాలక్కాడ్: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ బీజేపీ మాతృసంస్థ అయిన ఆరెస్సెస్ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. ఆరిఫ్ ఖాన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాష్ట్రంలోని యూనివర్సిటీల పనితీరును దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గవర్నర్ పదవి గవర్నమెంట్కు వ్యతిరేకంగా పనిచేయడానికి కాదని, రాజ్యాంగం హుందాతనాన్ని కాపాడటానికని హితవుపలికారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని విమర్శిస్తూ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆదివారం సంచలన ఆదేశాలు జారీచేశారు. కేరళలో అక్రమంగా నియమితులైన 9 యూనివర్సిటీలకు చెందిన వీసీలు తక్షణమే రాజీనామా చేయాలంటూ ఆర్డర్స్ పాస్ చేశాడు. సోమవారం ఉదయం 11:30 గంటల లోపే వీసీల రాజీనామాలు తన ముందుండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సీఎం పినరయి విజయన్ స్పందించారు. గవర్నర్ తీరుపై మండిపడ్డారు. కాగా, గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ కేరళకు చెందిన 9 మంది వీసీలు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దానిపై ఈ సాయంత్రం 4 గంటలకు విచారణ జరుగనుంది.