న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 : యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల కోసం ప్రభుత్వం మంగళవారం నిబంధనలను కఠినతరం చేసింది. ఇవి ఈ నెల 20 నుంచి అమల్లోకి వస్తాయి. చట్ట వ్యతిరేక కంటెంట్ని 3 గంటల్లోపల తొలగించడం తప్పనిసరి చేయడంతోపాటు, ఏఐ-సృష్టించిన కంటెంట్కి, సింథటిక్ కంటెంట్కు స్పష్టమైన లేబులింగ్ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అశ్లీల, మోసపూరిత, నకిలీ కంటెంట్ను సృష్టించడానికి, సర్క్యులేట్ చేయడానికి పెరుగుతున్న ఏఐ దుర్వినియోగానికి ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.
మర్మాంగాలను బహిర్గతం చేసే కంటెంట్, పూర్తి లేదా పాక్షిక నగ్నత్వం లేదా లైంగిక చర్యల విషయంలో నిషేధించిన కంటెంట్ను తొలగించడానికి ప్లాట్ఫామ్లకు స్పందించే వ్యవధిని రెండు గంటలకు ప్రభుత్వం తగ్గించింది. ఈ నిబంధనలు అమలు చేయడానికి ముందు అధికారులు ఏఐ జనరేటెడ్ డీప్ఫేక్లు, సమ్మతి లేని సన్నిహిత చిత్రాలు, వ్యక్తులను అనుకరించే లేదా వాస్తవ ప్రపంచ సంఘటనలను వక్రీకరించే వీడియోలు తరచుగా ఆన్లైన్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. వీటిని అరికట్టేందుకు బాధ్యతను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతోపాటు ఏఐ టూల్స్పై కూడా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021ని సవరిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.