Students | బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆంధ్రాహళ్లి ఏరియాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేత టాయిలెట్స్ కడిగించారు. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రాహళ్లి గవర్నమెంట్ స్కూల్లో కొంత మంది విద్యార్థుల చేత టాయిలెట్స్ క్లీన్ చేయించారు. ఓ ఇద్దరు విద్యార్థులు తమ చేతులతో టాయిలెట్ కుండీలను శుభ్రపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో టాయిలెట్లు కడిగించడం ఏంటని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఇవాళ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.