పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. దీంతో పాటు ప్రభుత్వ వ్యవహార శైలిపై కూడా కాంగ్రెస్ మండిపడింది. పెరిగిన పెట్రో ధరలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని, పారిపోతోందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. పెట్రో ధరల పెంపుపై చర్చిస్తామని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ.. ఇప్పుడు సమయం ఇవ్వడం లేదని, అసలు దాని ఊసే ఎత్తడం లేదని లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి మండిపడ్డారు.
ఇక రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పెట్రో పెంపుపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని, పారిపోతోందని ఎద్దేవా చేశారు. అయితే.. తాము మాత్రం వీధుల్లో నిరసనలు చేస్తూనే వుంటామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం వరకూ సభ నడపాలని నిర్ణయించినా… రెండు రోజుల ముందే ముగించడం బాగో లేదని, ప్రజల సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందని ఆయన అన్నారు.