న్యూఢిల్లీ, జూలై 12: క్యాపిటల్ మార్కెట్లకు పోయి అక్కడ పోగేసుకున్న సొమ్ముతో దేశంలో రోడ్లు వేస్తామని కేంద్రంలోని మోదీ సర్కారు చెప్తున్నది. రోడ్డు ప్రాజెక్టుల కోసం క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులను సమీకరిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం అన్నారు మరి. ‘మేమిప్పుడు క్యాపిటల్ మార్కెట్కు వెళ్తున్నాం. మాకేమీ ఆర్థిక ఇబ్బందుల్లేవు. అయినప్పటికీ షేర్ మార్కెట్కు పోతున్నాం. అయితే ధనికుల సొమ్మును వాడుకోవాలని మేమనుకోవడం లేదు. అందుకే అక్కడ చిన్నచిన్నవాళ్ల దగ్గర్నుంచి లక్ష, 2 లక్షల రూపాయల చొప్పున పెట్టుబడుల్ని సేకరిస్తాం. దీంతో భారీగా సొమ్ము జమవుతుంది. దీనిపై ఖచ్చితంగా వారికి 8 శాతం ప్రతిఫలం వస్తుందని హామీ ఇస్తున్నాం’ అని ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలున్నప్పటికీ దేశీయ మౌలిక రంగ ప్రాజెక్టుల నిధులకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు.
నిర్మాణ రంగ ఎక్విప్మెంట్ పరిశ్రమ పరిమాణం రూ.50,000 కోట్లన్న గడ్కరీ.. ముడి చమురు ధరల్లో పెరుగుదల వల్ల ఈ రంగం సమస్యల్ని ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ‘అధిక డీజిల్ ధరల వల్లే మనకీ సమస్య. వీలైనంత త్వరగా డీజిల్ను వదిలించుకుందాం. ఇదో హానికర ఇంధనం కూడా’ అంటూ సదరు ఎక్విప్మెంట్ తయారీదారులకు పిలుపునిచ్చారు. మిథనాల్, ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, వాటి వినియోగంలోకి మారాలని కోరారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)దే భవిష్యత్తు అని గడ్కరీ అన్నారు. భారతీయ ఆటో మార్కెట్లో స్థానిక సంస్థల వాటా పెరుగుతున్నదని, విదేశీ సంస్థల వాటా తగ్గుతున్నదని, దీనికి కారణం దేశీయ సంస్థలు ఈవీల తయారీవైపు మళ్లడమేనన్నారు. ఇదిలావుంటే దేశంలో బొగ్గు నిల్వలు సరిపడా ఉన్నప్పటికీ విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నామని, ఉత్పాదకతను పెంచడానికి 60 బొగ్గు గనులను ప్రైవేటీకరించాలనీ నిర్ణయించినట్టు గడ్కరీ ఈ సందర్భంగా చెప్పారు. కాగా, పెట్రోల్పై సెస్సును తగ్గిస్తే ఎన్హెచ్ఏఐ క్యాపెక్స్ ఫండ్స్కు ఇబ్బందులొస్తాయేమోనన్న ప్రశ్నకు గడ్కరీ బదులిస్తూ అది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చూసుకుంటుందన్నారు. ఎన్హెచ్ఏఐ కోసం బడ్జెట్ కేటాయింపుల్లో పెద్ద మొత్తం సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) నుంచే వస్తున్నది. ఇందులో పెట్రోల్, డీజిల్ సెస్సు కూడా ఉండటం గమనార్హం.