బెంగుళూరు: కర్నాటక(Karnataka)లోని బెంగుళూరులో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ప్రభుత్వ అధికారిని ఆమె కారు డ్రైవర్ హత్య చేశాడు. ఈ ఘటన పట్టణంలోని సుబ్రమణ్యపుర ప్రాంతంలో జరిగింది. ఇటీవల ఆ డ్రైవర్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు వివరాల ప్రకారం.. 45 ఏళ్ల ప్రతిమ కేఎస్.. రాష్ట్ర గనులు, భూగర్భ శాఖలో జియాలిజిస్ట్గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి ఆమె హత్యకు గురైనట్లు భావిస్తున్నారు.
అయిదేళ్ల నుంచి కాంట్రాక్టు డ్రైవర్గా చేస్తున్న కిరణ్ను ఇటీవల ఉద్యోగం నుంచి తీసివేశారు. తనను ఉద్యోగం నుంచి తీసివేసినందుకు హత్య చేసినట్లు పోలీసుల ముందు కిరణ్ అంగీకరించాడు. హత్య చేసిన తర్వాత అతను 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామరాజనగర్కు పరారీ అయినట్లు గుర్తించారు. హత్యకు గురైన ప్రభుత్వ అధికారి ప్రతిమ భర్త, కుమారుడు శివమొగ్గ జిల్లాలో ఉంటున్నారు.
ప్రతిమ గొంతును నిందితుడు కత్తితో కోసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున ఆమె శరీరాన్ని గుర్తించారు. శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు ఆమె ఆఫీసులోనే పనిచేశారని, కిరణ్ స్థానంలో కొత్తగా రిక్రూట్ అయిన డ్రైవర్ ఆమెను ఇంటి వద్ద డ్రాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు. శనివారం రాత్రి 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల మధ్య ఆ మర్డర్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
దొడ్డకల్లసంద్రలో రెండు అంతస్తుల ఇండిపెండెంట్ ఇంట్లో ప్రతిమ ఉంటోంది. శివమొగ్గలో ఆమె మాస్టర్స్ డిగ్రీ చదివింది. బెంగుళూరులో ఏడాది నుంచి పనిచేస్తోంది. ఆమె డైనమిక్ లేడీ అని ఆ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఆమె కొన్ని ప్రదేశాల్లో తనిఖీలు చేశారని, ఆమెకు ఎవరూ శత్రువులు లేరని, మంచి పేరు సంపాదించుకున్నదని ఓ ఆఫీసర్ తెలిపారు.