చండీఘడ్: భారత వైమానిక దళం ఇవాళ 90వ వార్సికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చరిత్రాత్మకమైన సందర్భమని, వైమానిక దళంలో ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం వెపన్ సిస్టమ్ బ్రాంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఐఏఎఫ్ చీఫ్ వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐఏఎఫ్లో ఆపరేషన్ బ్రాంచ్ను క్రియేట్ చేయడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. వెపన్ సిస్టమ్ శాఖ వల్ల ఫ్లయింగ్ శిక్షణ కోసం అయ్యే ఖర్చుల్లో సుమారు 3400 కోట్లను ఆదా చేయవచ్చు అని చౌదరీ తెలిపారు.
అగ్నిపథ్ స్కీమ్ ద్వారా వైమానిక దళంలోకి ఎయిర్ వారియర్లను ర్రికూట్ చేయడం ఓ పెద్ద సవాల్ అన్నారు. కానీ దేశంలోని యువత సామర్థ్యాన్ని గుర్తించి,, వాళ్లను దేశ సేవ కోసం వినియోగించుకోవాలన్నారు. అగ్నివీరుల శిక్షణ విధానాన్ని మార్చామని, ఐఏఎఫ్లో కెరీర్ను కొనసాగించేందుకు తగిన రీతిలో వారిని సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్లో 3వేల మంది అగ్నివీరులకు వాయు సేన కోసం శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సంఖ్యను మునుముందు పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు.
వచ్చే ఏడాది నుంచి మహిళా అగ్నివీరుల్ని ర్రికూట్ చేసేందుకు ప్లాన్ వేస్తున్నట్లు ఐఏఎఫ్ చీఫ్ తెలిపారు. దీని కోసం మౌళిక సదుపాయాల కల్పనలో నిమగ్నమైనట్లు ఆయన వెల్లడించారు. 90వ వార్షికోత్సవం సందర్భంగా భారత వైమానిక దళం ఇవాళ తమ దళం కోసం కొత్త యూనిఫామ్ను ఆవిష్కరించింది.