అంబర్పేట,కాచిగూడ జూన్ 26: అంబర్పేట నియోజకవర్గంలో ఉన్న అన్ని జంక్షన్లను అందంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం నారాయణగూడ వద్ద రూ.14 లక్షలతో చేపట్టనున్న వైఎంసీఏ జంక్షన్ అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని బర్కత్పురా, ఫీవర్ చౌరస్తా, అలీకేఫ్, ఓయూ, కాచిగూడ రైల్వేస్టేషన్ రోడ్డులను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించి నిధుల మంజూరుకు పంపించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే నారాయణగూడ జంక్షన్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, విష్ణు రెడ్డి పాల్గొన్నారు.
అంబర్పేట, జూన్ 26: అంబర్పేట నియోజకవర్గంలోని నాలా పరివాహక ప్రాంతాల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వెల్లడించారు. శనివారం నియోకజవర్గంలోని నల్లకుంట రత్నానగర్ నాలా నుంచి శివానందనగర్, అంబర్పేట డివిజన్ బాపూనగర్, పటేల్బాడా, ఎస్టీపీ వాటర్ వర్క్స్గేట్, సీబ్లాక్ వరకు కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలిసి క్షేత్రస్థాయిలోపర్యటించి నాలా పరివాహక ప్రాంతాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత విభాగం అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏడాది వరదలు వచ్చినప్పుడు హుస్సేన్సాగర్, మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మొయిన్ చెరువు నుంచి ఎస్టీపీ వరకు నాలాను పూర్తిస్థాయిలో విస్తరించేందుకు పలుమార్లు ఈ ప్రాంతాన్ని పర్యటించి ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ సీఈ వసంత, ఎస్పీపీఈ కన్సల్టెంట్ దుర్గరాజు, ఈఈ రేణుక, మహబూబ్మియా, ఎస్ఎన్డీపీ డిప్యూటీ ఈఈ వెంకటకిరణ్, ఈఈ గోపాల్, శంకర్, డీఈలు సుధాకర్, సంతోష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.