న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్లకు రూ.4500 కోట్లు ఇవ్వాలని నిర్ణయంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఇందులో రూ.3 వేల కోట్లను సీరమ్కు, రూ.1500 కోట్లను భారత్ బయోటెక్కు ఇవ్వనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారు.
నెలకు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి తమకు రూ.3 వేల కోట్లు అవసరమని సీరమ్ సీఈవో అదర్ పూనావాలా ఈ మధ్యే ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సాయం చేయడంతోపాటు వినూత్న విధానాలను కనుగొనడానికి వ్యాక్సిన్ తయారీదారులతో కలిసి ప్రభుత్వం పని చేస్తోందని పూనావాలా చెప్పారు. జూన్ నెలలోగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాలని సీరమ్ భావిస్తోంది.