Delhi High Court : సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ మీద ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్లతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం పరిశీలించింది. అగ్నిపథ్లో చేరడం అనేది స్వచ్ఛందగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఏదైనా సమస్య ఉందనిపిస్తే అందులో చేరకండి అని పేర్కొంది. ‘అగ్నిపథ్ స్కీమ్లో చేరడం అనేది తప్పనిసరి కాదు. అది ఎవరికి వారు స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన నిర్ణయం’ అని తేల్చి చెప్పింది. అంతేకాదు ‘ఈ స్కీమ్లో పొరపాటు ఏం ఉంది? అగ్నిపథ్ స్కీమ్ను ఆర్మీ, నౌకాదళం, వాయుసేనకు చెందిన నిపుణులు రూపొందించారు. మీరు (పిటిషనర్లు), మేము మిలిటరీ నిపుణులం కాదు’ అని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఆర్మీ నియామకాల కోసం ఈ ఏడాది జూన్లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్ను తీసుకొచ్చింది. పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీళ్లను నాలుగేళ్ల ఉద్యోగ కాలానికి ఆర్మీలోకి తీసుకుంటారు. నాలుగేళ్ల తర్వాత వీళ్లలో 25 శాతం మందిని క్రమబద్ధీకరిస్తారు. అయితే, ఈ కొత్త స్కీమ్ను దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. చాలాచోట్ల నిరసనలు చేపట్టారు. దాంతో, దిగొచ్చిన కేంద్రం వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది.