Gopichand Thotakura | న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: మొట్టమొదటి సారిగా ఒక తెలుగు వ్యక్తి అంతరిక్షానికి వెళ్లనున్నాడు. విజయవాడలో పుట్టి పెరిగి అమెరికాలో నివాసముంటున్న గోపీచంద్ తోటకూర(30) ఈ రికార్డును లిఖించబోతున్నాడు. ఎన్ఎస్-25 మిషన్ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసినట్టు బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రకటించింది. ఇందులో గోపీచంద్ తోటకూర ఒకరు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్. కాగా, వీరి అంతరిక్ష యాత్రకు ఇంకా తేదీ ఖరారు కాలేదు.
విజయవాడలో జన్మించిన గోపీచంద్ తోటకూర అమెరికాలో ఆరోనాటికల్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్ జెట్ పైలట్గా పని చేశారు. బుష్ ప్లేన్లు, ఏరోబాటిక్ ప్లేన్లు, సీప్లేన్లు, ైగ్లెడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లకు కూడా పైలట్గా వ్యవహరించారు. అట్లాంటాలో ప్రిజెర్వ్ లైఫ్ కార్ప్ అనే ఒక వెల్నెస్ సెంటర్కు గోపీచంద్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కాగా, ఇంతకుముందు పలువురు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అంతరిక్షయానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరులు. గోపీచంద్ మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఆయన వద్ద భారత పాస్పోర్టే ఉంది.