Google doodle winner | గూగుల్ వాడేవారికి డూడుల్స్ కొత్త కాదు. రోజుకో డూడుల్ మనల్నిపలకరిస్తుంది. ఎన్నో ప్రత్యేకతలను కలిగిఉన్న ఈ డూడుల్ తయారీలో గూగుల్ పోటీ పెడుతుంది. ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేయడం, ఆలోచనలు రేకెత్తించడం, కొత్త విషయాన్ని నేర్చుకోవడం వంటివి ఈ గూగుల్ డూడుల్ అందిస్తుందని చెప్పవచ్చు. బాలల దినోత్సవం సందర్భంగా కోల్కతాకు చెందిన శ్లోక్ ముఖర్జీ అనే విద్యార్థి డూడుల్ను ఈ ఏడాది అత్యుత్తమ డూడుల్గా గూగుల్ సంస్థ ప్రకటించింది.
ఈ ఏడాది అత్యుత్తమ గూగుల్ డూడుల్ను గూగుల్ సంస్థ సోమవారం ప్రకటించింది. కోల్కతాకు చెందిన శ్లోక్ ముఖర్జీ తయారుచేసిన ‘ఇండియా ఆన్ ది సెంటర్ స్టేజ్’ అనే స్ఫూర్తిదాయకమైన డూడుల్ను ఇండియా విజేతగా ప్రకటించింది. డూడుల్ పోటీలో 20 మంది ఫైనలిస్ట్లను ఎంపిక చేసిన రెండు వారాల తర్వాత అత్యుత్తమ డూడుల్ను ప్రకటించింది. ఐదు క్యాటగిరీల్లో ఇష్టమైన డూడుల్ను ఎంచుకోవాలంటూ నెటిజెన్లను గూగుల్ కోరింది. భారతదేశంలోని 100 నగరాల నుంచి 1 నుంచి 10 తరగతుల పిల్లల నుంచి పోటీకి 1,15,000 కంటే ఎక్కువ ఎంట్రీలు వచ్చాయని గూగుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘రాబోయే 25 ఏండ్లలో నా భారతదేశం..’ అనే థీమ్పై పోటీ నిర్వహించారు.
ఈ పోటీలో జాతీయ విజేతగా నిలిచిన వారికి రూ. 5,00,000 కాలేజ్ స్కాలర్షిప్, రూ. 2,00,000 టెక్నాలజీ ప్యాకేజీని అందిస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. దీంతోపాటు ట్రోఫీ ఆఫ్ అచీవ్మెంట్, గూగుల్ హార్డ్వేర్ డివైస్లను బహుమతిగా అందజేయనున్నట్లు ఈ టెక్ దిగ్గజం తెలిపింది. 2009 నుంచి ప్రతి ఏటా మన దేశంలో డూడుల్ ఫర్ గూగుల్ పోటీలను నిర్వహిస్తున్నారు.