భువనేశ్వర్: బలమైన గాలికి ఆగి ఉన్న గూడ్స్ రైలు (goods train) కదిలింది. దాని కింద ఉన్న కొందరు కూలీలు మరణించగా మరి కొందరు గాయపడ్డారు. ఒడిశాలోని జాజ్పూర్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం జాజ్పూర్ రోడ్డ్ స్టేషన్ వద్ద కొందరు కూలీలు రైలు పట్టాల రిపేర్ పనులు చేస్తున్నారు. ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది. దీంతో కూలీలు పని ఆపారు. వర్షంలో తడవకుండా ఉండేందుకు అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలు కిందకు వెళ్లారు. ఆ గూడ్స్ రైలుకు ఇంజిన్ కూడా లేదు.
కాగా, బలంగా వీచిన గాలికి గూడ్స్ రైలు వ్యాగన్లు ముందుకు కదిలాయి. దీంతో గూడ్స్ రైలు కింద ఉన్న కూలీలు వ్యాగన్ల చక్రాల కింద నలిగిపోయారు. నలుగురు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించారు. గాయపడిన కూలీలను జాజ్పూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు కూలీలు మరణించారు. దీంతో ఈ సంఘటనలో చనిపోయిన కూలీల సంఖ్య ఆరుకు చేరగా మరో ఇద్దరు గాయపడ్డారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తతలు జరుగకుండా చర్యలు చేపట్టారు. ఒడిశాలోని బాలాపూర్ జిల్లాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాద సంఘటన మరిచిపోక ముందే గూడ్స్ రైలు కింద పడి కూలీలు మరణించడం స్థానికంగా కలకలం రేపింది.