ముంబై, సెప్టెంబర్ 26: ఆకాశం నుంచి స్వర్ణశిలలు రాలుతాయని చందమామ కథల్లో చదువుకున్నాం. మహారాష్ట్రలోని ఉస్మాన్జిల్లా వశి మండలానికి చెందిన ప్రభు నివతి అనే రైతుకు నిజజీవితంలో ఇలాంటి ఘటనే ఎదురైంది. శుక్రవారం ఉదయం నివతి పొలం పనులు చేసుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఈదురు గాలులు మొదలయ్యాయి. వర్షం పడుతుందేమోనని అనుకున్నాడు. ఇంతలో కొద్దిదూరంలోనే భారీ శబ్దంతో ఓ రాయి పడింది. బంగారపు రంగులో మెరుస్తున్న ఆ రాయిని చూసి నివతి ఆశ్చర్యపోయాడు. ఏడు అంగుళాల పొడవు, ఆరు అంగుళాల వెడల్పుతో రెండున్నర కిలోల బరువు ఉన్న ఆ రాయిని పరీక్షల కోసం అధికారులు తీసుకెళ్లారు. గ్రామస్థులు దాన్ని ‘స్వర్ణశిల’గా అభివర్ణించారు.