కాన్పూర్: 50 సార్లు ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదని 23 ఏండ్ల బీటెక్ బంగారు పతక గ్రహీత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. హృదయ విదారకమైన ఆత్మహత్య లేఖలో ‘సారీ నాన్న, ప్రభుత్వం ఉద్యోగం కోసం 50 సార్లు ప్రయత్నించాను. కానీ నేను సఫలం కాలేకపోయాను. దయచేసి నన్ను క్షమించు’ అని పలుమార్లు అతడు తన తండ్రిని క్షమాపణ కోరాడు. ఇంటి పని మనిషి ఇల్లు లోపలి వైపు తాళం వేసి ఉండటాన్ని గమనించి విషయాన్ని పోలీసులకు, మృతుడు ఆనంద్ కుమార్ కుటుంబానికి తెలిపింది. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా ఆనంద్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. అయిదు రోజుల క్రితం ఆనంద్ నాన్న, తాత అతడి అన్నకు పెండ్లి సంబంధం చూసేందుకు బీహార్ వెళ్లారు. 2024లో బీటెక్ పూర్తి చేసిన ఆనంద్ రాష్ట్రంలో మూడో ర్యాంక్ సాధించడంతో గవర్నర్ నుంచి బంగారు పతకం అందుకున్నాడు.